అలకనంద ‘కిడ్నీ రాకెట్’ ఘటన. పై మంత్రి దామోదర కీలక నిర్ణయం
ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు
దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి
ఈ రాకెట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలన్న మంత్రి
హైదరాబాద్లోని అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్’ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఈ రాకెట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలన్నారు. దోషులకు చట్టప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటేనే వణికిపోవాలన్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి చైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమంత్, గోపిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
సరూర్నగర్లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి వ్యవహారాలపై విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించింది