అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలి  — మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలి 

— మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ

 

ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్చి మంత్రి శ్రీమతి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సురేఖ సూచించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 26 జనవరి 2025 నాటికి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరిలతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ ఆఫీసర్ హరి చందన, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు సంబంధించిన పథకాల అమలు విధివిధానాలు, లబ్దిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలోతీసుకుంటున్న చర్యలు తదితర అంశాల పై మంత్రి సురేఖ కలెక్టర్లతో చర్చించారు. రాజకీయ ప్రమేయం లేకుండా, మానవతా దృక్పథంతో పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూ భారతి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు మాత్రమే రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అర్హులని మంత్రి సురేఖ కలెక్టర్లకు స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా కఠినంగా విధివిధానాలను అమలు చేయాలని నిర్దేశించారు. రియల్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, లే ఔట్ భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్ళు నిర్మించిన భూములు తదితర భూములకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో ఈ పథకం అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవల వినియోగించుకోవాలని సూచించారు. తమ భూములకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వుంటుందని, ఈ దిశగా ఆలోచన చేయాలని మంత్రి సురేఖ కలెక్టర్లకు సూచించారు. 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్ తీసుకుంటున్నట్లు మంత్రి కలెక్టర్లకు తెలిపారు. ఈ పథకం కింద భూమి లేని పేద వ్యవసాయ కూలి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందివ్వనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉపాధి హామీ కింద కనీసం 20 రోజులు పనిచేసినవారు లబ్దిదారులుగా గుర్తించబడతారని తెలిపారు. గ్రామ సభలను నిర్వహించి మార్గదర్శకాల అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఆయా జిల్లాల్లోని జాబ్ కార్డుల వివరాలను మంత్రి సురేఖ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా అమలు చేస్తున్న విధివిధానాలను మంత్రి సురేఖ కలెక్టర్లతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిగారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా గుర్తించిన వారిలో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. గ్రామసభలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని వార్డుల్లో అర్హుల జాబితాల రూపకల్పన పై మంత్రి సురేఖ కలెక్టర్లను ఆరా తీశారు. జనవరీ 26 నాటికి లబ్దిదారుల జాబితాను వెల్లడించే విధంగా సన్నద్ధంగా వుండాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీలతో సంప్రదించి లబ్దిదారులు ఎంపిక పూర్తి పారదర్శకతతో జరిగేలా కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్లను మంత్రి నిర్దేశించారు. 

 

గతంలో అమలు చేసిన మార్గదర్శకాల మేరకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు వుండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ‘వన్ రేషన్ – వన్ స్టేట్’ గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. నిరుపేద వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా అందించే ప్రయోజనాలు వారి కుటుంబాలను నిలబెడతాయని ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హత వున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూర కావాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. కొత్తగా అమలు చేయనున్న పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేఖ సమాధానమిచ్చారు. పథకాలు అమలు నిరంతర ప్రక్రియని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు దక్కుతాయని మంత్రి సురేఖ వారికి స్పష్టం చేశారు. నూతన పథకాల అమలుకు సంబంధించి మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను తీర్చాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. నియోజకవర్గాల స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి, తనను చేర్చాలని, దీంతో పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి తనకు అవకాశముంటుందని మంత్రి సురేఖ ప్రజాప్రతినిధులకు కోరారు. సర్వసన్నద్ధంగా వుండి జనవరి 26 నుంచి నూతన పథకాల అమలులో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబర్చాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యం వహించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనుకాడనని మంత్రి సురేఖ హెచ్చరించారు. అతి త్వరలో మరో మీటింగ్ ద్వారా నూతన పథకాల అమలు పై కూలకషంగా చర్చిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు

 ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికకు గ్రామాల వారిగా టీములు ఏర్పాటు తో పాటు, గ్రామ సభల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేసుకున్నట్లు దానికి అనుగుణంగా ప్రభుత్వ పథకాల అమలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రివర్యులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జిల్లా సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం ఈడీఎం సందీప్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment