డ్రైవర్ రహిత కారును తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్..టెస్ట్ డ్రైవింగ్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు.
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు మానవ జీవితాలలో ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను రూపొందించి సంగారెడ్డి జిల్లా కంది లో ఉన్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, దేశంలో రోడ్డు ప్రయాణాన్ని సమూలంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు. ఆ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. డ్రైవర్ రహిత కారును రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ దేశానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలను తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని రంగాలలో ఉపయోగించుకుంటామని ఆయన వెల్లడించారు. ఇటీవల అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు పర్యటించారు.ఆ సమయంలో సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ ప్రయాణం చేశామన్నారు. అక్కడి ప్రయాణం కంటే ఐఐటీలో మన విద్యార్థులు రూపొందించిన కారులో చేసిన ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.
భారతదేశ ట్రాఫిక్ కు అనుగుణంగా.…
ఐఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన డ్రైవర్ రహిత కారు ఇప్పటికే సిగ్నల్స్ను, ట్రాఫిక్ సింబల్స్ ను గుర్తు పట్టి తదననుగుణంగా కదులుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ వాహనాలు తమకు అడ్డుకు వచ్చిన అన్ని రకాల వాహనాలను, రోడ్డు పరిస్థితిలను గుర్తించాడని వీలుగా ఈ వాహన తయారుదారులు తెలంగాణ లో సుమారుగా 4,000 కిలోమీటర్లు ప్రయాణించి, ఫోటోగ్రాఫ్స్, వీడియోలు తీసి క్లౌడ్ లోకి అప్లోడ్ చేసారు. డ్రైవర్ రహిత కార్లు ఆ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డుపై పరుగులు తీస్తాయని వారు తెలిపారు.