హైడ్రా ప్రతిపక్షాలపై ప్రతీకారం కోసమా.?హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు…!
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్ చేయడానికే పెట్టినట్లు ఉందని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరుపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కూడా హైకోర్టు ప్రశ్నించింది.
కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దుర్గంచెరువు ఎఫ్టీఎల్లో పరిధిలో ఉన్న కావూరి హిల్స్ కాలనీలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి.. కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అదే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇనార్బిట్ మాల్, రహేజా టవర్స్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లక్ష అనధికార నిర్మాణాలు
హైదరాబాద్ మహా నగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయని, వారందరికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదని కోర్ట్ సూటిగా ప్రశ్నించింది. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారని హైకోర్టు అడిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అని హైడ్రా అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక గురువారం ఉదయం దుర్గం చెరువు ప్రాంతంలోని సుమారు 104అక్రమ నిర్మాణాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది.