దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్ మేరకు తగినంత బొగ్గును సరఫరా చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఏరియా జీఎంలను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో 21.65 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా. 20.94 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. జులై నెలలో కురిసిన వర్షాల వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రతీ రోజూ విలువైనదని ఈ ఏడాది నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా జరిగేలా చూడాలని కోరారు. అలాగే 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించడానికి వీలుగా ఓబీ కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఓబీ లక్ష్యాలపై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలన్నారు. ప్రస్తుతం అడపా దడపా వర్షాల వల్ల ఉత్పత్తికి కొంత ఆటకం అయినప్పటికీ గనుల్లో నిలిచి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలన్నారు. ఒక వైపు వర్షాకాలంలో కలిగిన లోటును భర్తీ చేసుకుంటూ ఈ నెలలో ఇచ్చిన లక్ష్యాలను కూడా దాటి ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు.ఉత్పత్తి లక్ష్యాల సాధనలో రక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. భూ గర్భ గనుల్లో, అలాగే ఉపరితల గనుల్లోని పని ప్రదేశాల్లో అధికారులు, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి సాధించాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు కూడా రక్షణ సూత్రాలను పాటించాలని, స్వీయ రక్షణను మరవొద్దని, రక్షణ లేని పని ప్రదేశాలను గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సంస్థ డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్) ఎన్ వి కె శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి . వెంకటేశ్వర్ రెడ్డి, జీఎం (కోఆర్డినేషన్) జి.దేవేందర్, జీఎం (సి పి పి) శ్రీ జక్కం రమేశ్, జీఎం(సేఫ్టీ) సుభానీ, జీఎం(ఎంపీ) సుబ్బారావు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి , రవాణా సాధించాలి
Published On: August 2, 2024 10:07 pm
![](https://charminarexpress.in/wp-content/uploads/2024/08/IMG-20240802-WA0030.jpg)