వివిధ పథకాలకు, హైదరాబాద్ అభివృద్ధికి నిధులివ్వండి: కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు రూ.55 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇళ్ళు మంజూరు చేయాలని కోరిన సీఎం
తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రమంత్రికి వివరించిన సీఎం
తెలంగాణలో వివిధ కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు రూ.55,652 కోట్లు ఆర్థిక సాయం చేయాలని కోరారు. నిన్న హైదరాబాద్లోని ఓ హోటల్లో పీఎంఏవై(యూ) పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సంబంధిత అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాష్ట్రంలో 65 శాతం పట్టణ ప్రాంతమే అన్నారు. తెలంగాణను లక్ష కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్, రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరస్సుల పునరుజ్జీవం, నీటి ఎద్దడి నివారణ, భూభారతి చట్టం, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050, బిల్డ్ నౌ, టౌన్షిప్ గ్రోత్ సెంటర్లు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రికి సీఎం వివరించారు.దేశ పట్టణ జనాభాలో 8 శాతం తెలంగాణలో ఉన్నారని, పీఎం ఆవాస్ (అర్బన్) యోజన కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉందన్నారు. అందుకే మెట్రో ఫేజ్-2 కింద ఆరు కారిడార్లను గుర్తించామని, వీటిలో ఐదింటికి డీపీఆర్లు పూర్తైనట్లు చెప్పారు. వీటి నిర్మాణానికి రూ.24,269 కోట్లు అందించాలని కోరారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ఇందుకోసం రూ.10,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.4,170 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాల ప్రగతిని కేంద్రమంత్రికి వివరించారు.