ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుక ఏర్పాటులు
Republic Day Parade 2025 : ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే – 15వేల మంది పోలీసులు, 6 అంచెల భద్రత, వేల సీసీ కెమెరాలతో పూర్తి నిఘా
ఢిల్లీ : జనవరి 26, 2025న జరిగే రిపబ్లిక్ డే వేడుకలు సజావుగా నిర్వహించేందుకు నగరం చుట్టూ వేలాది సీసీటీవీలు ఏర్పాటు చేశారు.
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ (CCTV) కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పందించిన డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా.. 6 అంచెల సెక్యూరిటీ చెకింగ్స్ ఏర్పాటు చేశామని, ముఖ్యమైన ప్రదేశాలలో వీడియో కెమెరాలు, వీడియో అనలిటిక్స్, ఎఫ్ఆర్ఎస్ ( FRS -Facial recognition system), మల్టీలేయర్ బారికేడింగ్ సిస్టమ్ (Multilayer barricading system)ను సిద్ధంగా ఉంచామన్నారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరిస్తారని చెప్పారు.
వేల సంఖ్యలో సీసీటీవీలు, కెమెరాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా చెప్పారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఢిల్లీలో వేలాది సీసీటీవీలు, కెమెరాలు ఇన్ స్టాల్ చేశామన్నారు. వీటిల్లో కొన్ని కెమెరాల్లో వీడియో అనలిటిక్ ఫీచర్లు (Video Analytics Features) కూడా ఉన్నాయన్నారు. నేరస్థులు, వాంటెడ్ టెర్రరిస్టుల డేటాబేస్ ను సులభంగా గుర్తించేలా సీసీటీవీలో వివరాలను పొందుపర్చామని, వారికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్లు, పోలీసు సిబ్బందికి హెచ్చరికలు అందుతాయని డీసీపీ తెలిపారు. దాంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీకెవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అని సూచించారు.
గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడు
ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ కి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto) హాజరుకానున్నారు. ఆయన జనవరి 23 నుండి జనవరి 26 వరకు భారతదేశంలోనే ఉంటారు. ఆయన పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, దేశాధ్యక్షుడు ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఇక రిపబ్లిక్ డే పరేడ్కు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున, రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఇండోనేషియా బృందాన్ని ఆహ్వానించడం మరో ముఖ్య విషయం.