జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి
వివాహ కార్యక్రమానికి హజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు మరో ఇద్దరు మృతి
క్షతగాత్రులను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లా నగరి పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వారు, తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో జరిగిన వివాహానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నగరి సమీపంలో బస్సు డ్రైవర్ ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో పుత్తూరు నుంచి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సీతారామపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పార్థసారథి నాయుడు (70), రాజేంద్ర నాయుడు (65), తిరుపతికి చెందిన ధనుశ్ (10), తిరుత్తణికి చెందిన కుమార్ (55) మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా తిరుపతి – చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు